Jan 28,2023 23:28

సమావేశమైన స్టీల్‌ ఒబిసి అసోసియేషన్‌ నాయకులు

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 30వ తేదీన ఉక్కునగరంలో త్రిష్ణ గ్రౌండ్‌లో చేపట్టే ఉక్కు ప్రజా గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం పలుచోట్ల ప్రచారాలు జరిగాయి.
ఉక్కునగరం : ఉక్కునగరం ఓబీసీ కార్యాలయంలో స్టీల్‌ ఓబీసీ అసోసియేషన్‌ అధ్యక్షులు బి అప్పారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు ప్రజా గర్జనకు ఓబీసీ సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపనిచ్చారు. ప్లాంట్‌ పరిరక్షణకు ఓబిసి అసోసియేషన్‌ గట్టిగా పనిచేయాలన్నారు. పోరాట కమిటీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో ఓబీసీ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉండవల్లి శ్రీనివాసరావు, ఆర్‌వి.నారాయణ, కొణతాల రామకృష్ణ, కారు దేముడు, గోవిందు, కోయిలాడు శ్రీనివాస్‌, వంగపండు తదితరులు పాల్గొని గర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అగనంపూడిలో మానవహారం
గాజువాక : ఉక్కు ప్రజా గర్జనను జయప్రదం చేయాలని కోరుతూ అగనంపూడిలో టిఎన్‌టియుసి నాయకులు బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యాన మానవహారం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజా గర్జనలో వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పూర్ణానందశర్మ పాల్గొన్నారు.