Jul 19,2023 23:46
జెండా ఊపి ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌

ప్రజాశక్తి-కర్లపాలెం: బాపట్ల కేంద్రంగా పెట్టుబడులతో పరిశ్రమలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఛాయిస్‌ క్యానింగ్‌ పరిశ్రమ ప్రతినిధులను స్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు మాజీ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్‌ ప్రభాకర్‌ అన్నారు. బుధవారం కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం పంచాయతీ పరిధిలో అన్నం సతీష్‌ ప్రభాకర్‌ మెరైన్‌ కంపెనీలో ఛాయిస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ ల్యాబ్‌ను ఛాయిస్‌ క్యానింగ్‌ కంపెనీ అధినేత జోస్‌ థామస్‌తో కలిసి ప్రారంభించారు. అన్నం సతీష్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ ఆక్వా రైతుల సౌకర్యం కోసం ఛాయిస్‌ క్యానింగ్‌ సౌజన్యంతో కోటి యాభై లక్షల విలువలతో కూడిన బైల్‌ ల్యాబ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భారీ వ్యయంతో ఛాయిస్‌ క్యానింగ్‌ కంపెనీ బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌, స్కూల్స్‌, ఓడలు వ్యాపారాలలో విదేశాలలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్న పెద్ద కంపెనీ బాపట్ల రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. రైతుల కోసం రూ.కోటి 50 లక్షలతో కూడిన అత్యధిక సౌకర్యాలతో సాంకేతిక ప్రమాణాలతో ఉన్న మొబైల్‌ ల్యాబ్‌ స్థానికంగా ఉండడంతో నేరుగా ఆక్వా రైతుల వద్దకే వెళ్లి యాంటీ బయోటెక్‌ పరీక్షలు చేయడం సాధ్యమవుతుందన్నారు. ఛాయిస్‌ క్యానింగ్‌ అధినేత థామస్‌ మాట్లాడుతూ అత్యంత వైవిధ్య భరితమైన ఛాయిస్‌ గ్రూపులో భాగమైన ఛాయిస్‌ క్యానింగ్‌ పరిశ్రమ సముద్ర ఆహార ఎగుమతిలో అగ్రగామిగా ఉందని, భారతదేశపు మొట్టమొదటి మొబైల్‌ ఎలిశా ల్యాబ్‌ బాపట్ల కేంద్రంగా ప్రారంభించామని అన్నారు. ఛాయిస్‌ గ్రూప్‌ యొక్క 70వ సంవత్సరంలో సమ్మేళనం ఆక్వా కల్చర్‌ రంగంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. నాణ్యత, ఆవిష్కరణలు, పర్యావరణ సారథ్యం పట్ల స్థిరమైన నిబద్ధతతో ఛాయిస్‌ గ్రూప్‌లో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను కొనసాగిస్తుందని, అత్యధిక సౌకర్యాలు సాంకేతికత ఉత్తమ అభ్యాసాల పట్ల అంకితభావం దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో అత్యుత్తమ ప్రతిభను సంపాదించాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌తో కలిసి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషంగా భావిస్తున్నానని అన్నారు.