రికార్డులను పరిశీలిస్తున్న మండల వ్యవసాయాధికారి
ప్రజాశక్తి - నకరికల్లు : లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే వరి విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు మండల వ్యవసాయాధికారి దేవదాస్ సూచించారు. మండల కేంద్రమైన నకరికల్లులోని మహితా ట్రేడర్స్నులో అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. విత్తనాల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. విత్తనాల విక్రయ సందర్భంలో బిల్లుపై కొనుగోలుదారుని సంతకం, అమ్మిన వారి సంతకం, విత్తన రకం, లాట్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. లైసెన్స్ లేకుండా విత్తనాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బిపిటి 5204, హెఎంటి రకం వరి విత్తనాలు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నాయో లేదో పరిశీలనకు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్నకు పంపించినట్లు ఏవో తెలిపారు.










