న్యూఢిల్లీ : కోవిడ్ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై గతంలో ప్రకటించిన ఆంక్షలను ఎన్నికల కమిషన్ సడలించింది. బహిరంగ సభలు నిర్వహించే మైదానం సామర్థ్యంలో 30 శాతం మందితో సభలు నిర్వహించుకోవచ్చునని, ఇండోర్ మీటింగ్లు అక్కడి సామర్ధ్యంలో 50 శాతం మందితో నిర్వహించుకోవచ్చునని పేర్కొంది. రోడ్ షోలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో శనివారం సమావేశం నిర్వహించి, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సూచనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇసి తెలిపింది. ఎన్నికల కోసం నియమించిన చాలా మంది ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక పరిశీలకులు పరిమితులను సడలించాలని సిఫార్సు చేశారని తెలిపింది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, అత్యధికంగా నమోదవుతున్న కేసులు పోలింగ్ జరగని రాష్ట్రాల నుంచేనని ఆరోగ్య కార్యదర్శి కమిషన్కు తెలియజేశారని పేర్కొంది.










