ప్రజాశక్తి-తెనాలి : కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు శాంతి భధ్రతలు కరువయ్యాయని పిసిపి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామం ఉప్పరపాలెం ప్రాంతంలో హత్యకు గురైన బాలుడు ఉప్పల అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం తెనాలి వచ్చిన ఆయన పార్టీ నాయకులకు ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చందు సాంబశివుడు వైకుంఠపురం ఆలయం వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భధ్రతలు లోపించాయని, మహిళలకు రక్షణ లేదని అన్నారు. సామాన్యులపై వైసిపి నేతలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని, రాజోలులో బాలుడి కాళ్లు కట్టేసి దాడి చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టడం చాలా దారుణమని అన్నారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తుందని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనవెంట కాంగ్రెస్ పార్టీ ఏపి వ్యవహారాల ఇన్చార్జి మలయప్పన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, స్థానిక నాయకులు పి.నాగ సూర్యశశిధరరావు, కె.బుల్లియ్య, శివప్రసాద్, పాల్గొన్నారు.










