Jan 05,2023 00:01

దీక్షలో కూర్చున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం, కలెక్టరేట్‌ విశాఖ : ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి, కార్మిక వర్గాన్ని నడి రోడ్డు పాలుచేసేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, దీన్ని పోరాటాల ద్వారా అడ్డుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 692వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ డబ్ల్యుఎండి, యుటిలిటీస్‌, అడ్మిన్‌, టిఎ విభాగాల కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, కో-కన్వీనర్‌ ఎన్‌.రామచంద్రరావు, నాయకులు జె.రామకృష్ణ, గుమ్మడి నరేంద్ర తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్ల దేశంలో ఆర్థికాభివృద్ధి జరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయివేటీకరణపై పునరాలోచించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలలో మాత్రమే కార్మిక హక్కులు, సంక్షేమం, పర్యావరణ రక్షణ, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద పరిసరాల అభివృద్ధి తదితర సామాజిక హితమైన అంశాలు అమలవుతాయని తెలిపారు. వేతన సవరణపై గందరగోళానికి గురిచేయడం కేంద్రానికి తగదన్నారు. ఈ కార్యక్రమంలో జి.ఈశ్వరరావు, విఎస్‌.వరప్రసాద్‌, బి.బాలస్వామి, ఎన్‌.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.