
ప్రజాశక్తి-సీతమ్మధార : ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు రానున్నాయని ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ విశ్వమిత్ర తెలిపారు. రామాటాకీస్ వద్ద గల ఆసుపత్రిలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ మల్లికార్జున మంజూరు చేసిన రూ.25 లక్షలతో ఆసుపత్రిలో నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన 250 కెవి విద్యుత్ ట్రాన్ష్ఫార్మర్, 620 కెవి జనరేటర్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. కంటి పరీక్షలకు ఉపయోగించే మూడు సీట్లు ల్యాంప్లు సమకూరాయని, వీటిని త్వరలో జిల్లా కలెక్టర్ ద్వారా ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ చొరవతో హెచ్పిసిఎల్ కంపెనీ సిఎస్ఆర్ కింద ఆసుపత్రి అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.28 లక్షలతో గ్లుకోమా వ్యాధిగ్రస్తుల్లో దృష్టి సామర్థ్యాన్ని అంచనా వేసే అత్యాధునిక విజువల్ ఫీల్డ్ ఎనలైజర్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రెటీనా సంబంధిత, క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించడానికి అవసరమైన పేకో మిషన్లను రూ.60 లక్షలతో కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. రూ.15 లక్షలతో స్పెషల్ మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ పరికరాలన్నీ అందుబాటులోకి వచ్చాక కార్పొరేటర్ ఆసుపత్రిలో లభిస్తున్న ఎంతో ఖరీదైన వైద్య సేవలు ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో 90 శాతం వరకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆపరేషన్ కోసం వచ్చేవారికి అరగంటలో వైద్య పరీక్షలు పూర్తిచేసి శస్త్రచికిత్సకు పంపేలా ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. కంటి వైద్యానికి సంబంధించి సలహాలు, సూచనల కోసం ఆసుపత్రికి వచ్చేవారికి ప్రతి శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రతిస్పందన సేవలు అందిస్తామని తెలిపారు. నిపుణులైన వైద్యులు సెకండ్ ఒపీనియన్ సేవలు సలహాలు ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.