Apr 14,2023 01:40
ప్రాంగణ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో కళాశాల అధిపతులు

ప్రజాశక్తి-బాపట్ల: కళాశాల ప్రాంగణ ఎంపిక ఉద్యోగ నియామకాల్లో బాపట్ల ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం కళాశాలలో జరిగిన ప్రాంగణ ఉద్యోగ ఎంపికలో వ్యవసాయ ఇంజనీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు సురేంద్ర, డి హర్షవర్ధన రెడ్డి ఒక్కొక్కరికి రూ.6.50 లక్షల వార్షిక వేతనానికి ఎంపికైనట్లు బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డిడి స్మిత తెలిపారు. అదేవిధంగా థాన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ప్రాంగణ ఎంపిక నియామకాల్లో రూ.4.50 లక్షల వార్షిక వేతనానికి వ్యవసాయ ఇంజనీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు సురేంద్ర, టి వాణిశ్రీ, ఉషశ్రీ, భార్గవి, చాందిని ప్రియ, వెంకట సాయి, నాగ దీక్షిత్‌, సాయి చరణ్‌ తేజ, మహేశ్వరి దేవి, విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. గతంలో జరిగిన ప్రాంగణ ఎంపికలో టాఫ్‌ ట్రాక్టరు కంపెనీలో బిటిక్‌ వ్యవసాయ ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులు ఇద్దరు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ప్రాంగణ ఎంపిక అధికారి ఎస్‌ విష్ణువర్ధన్‌, ఆచార్యులు, అధిపతులు పాల్గొన్నారు.