ప్రజాశక్తి-గుంటూరు : సాంకేతిక విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్ధులు ప్రాక్టికల్ నాలెడ్జి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవటం ద్వారా క్యాంపెస్ సెలక్షన్స్లో మంచి ఉద్యోగాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. శనివారం నల్లపాడు ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సాంకేతిక విద్యతోపాటు సాధరణ డీగ్రీలు చదువుతున్న విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు పోందేందుకు ఇంటర్న్షిప్ ద్వారా స్కిల్ పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోను క్యాంపస్ సెలక్షన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో 280 మందికి 155 మంది మల్టీనేషన్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు సైతం మరింత ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో ఉన్న అత్యున్నత ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలన్నారు. క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు పొందిన విద్యార్ధులకు కలెక్టర్ నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎస్బీటీఈటీ బోర్డు సెక్రటరీ కేవీ రమణ, ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తాళ్లురి శేఖర్, గవర్నమెంట్ పాలిటెక్నీక్ ఫర్ మైనార్టీస్ కళాశాల ప్రిన్సిపల్ కె.రాజశేఖర్, కుమార్ సంస్థల చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఎంబీటీఎస్ శిక్షణ, ప్లేస్మేంట్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.










