ప్రజాశక్తి-పంగులూరు: పోటీ పరీక్షల వలన విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని, చందలూరు కెనరా బ్యాంక్ మేనేజర్ దాసరి అనిల్ కుమార్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్విజ్ ఫర్ చిల్డ్రన్ పోటీలు బుధవారం పంగులూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, మండల పరిధిలోని హైస్కూల్ విద్యార్థులకు జరిగాయి. ఈ పోటీలలో మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పాల్గొనగా, పంగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉన్నం అఖిల్ కుమార్, రాయని సాంబశివ ప్రథమ స్థానం సాధించగా, బూదవాడ విద్యార్థులు భవనం శివాని, దివ్యలు ద్వితీయ స్థానం సాధించారు. కొండమంజులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఫణిదపు యశ్వంత్, యశస్వినిలు తృతీయ స్థానం సాధించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పంగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొప్పోలు రమాదేవి, ఉపాధ్యాయులు రామకోటిరెడ్డి తదితరులు బహుమతులు అందించారు.










