Nov 03,2023 23:12

ప్రజాశక్తి - గోపాలపురం మండలంలోని కొవ్వూరుపాడు పోస్టల్‌ కార్యాలయాన్ని తాడేపల్లి గూడెం పోస్టల్‌ సూపరిం టెండెంట్‌ సి. వెంకట రామిరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిగూడెం డివిజన్‌ పరిధిలో ఒకటి హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, 35 సబ్‌ పోస్ట్‌ ఆఫీసులు, 193 బ్రాంచ్‌ పోస్ట్‌ ఆఫీసులు ఉన్నాయని తెలిపారు. ప్రతి పోస్ట్‌ ఆఫీస్‌ పనితీరు, లావాదేవీలు తప్పనిసరిగా ఆడిట్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇన్సూరెన్స్‌, ప్రీమియం, సేవింగ్స్‌ (ఆర్‌.డి), సుకన్య, ఫిక్స్‌ డిపాజిట్‌, అకౌంట్స్‌ లావాదేవులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఖాతాదారుల పాస్‌ బుక్కులకు ఆన్‌లైన్‌లో జమ చేసిన నగదు వివరాలను పరిశీలించినట్లు చెప్పారు. ఈనెలాఖరు వరకూ పోస్టల్‌ స్పెషల్‌ డ్రైవ్‌ దేశమంతటా జరుగుతుందని వివరించారు. ఈ డ్రైవ్‌లో తపాలా శాఖ ద్వారా ఇన్సూరెన్స్‌, డిపాజిట్లు వడ్డీ రేట్ల యొక్క వివరాలను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. తపాలా శాఖలో ప్రీమియం తక్కువగా ఉంటుందని, బోనస్‌ మాత్రం అధికంగా ఉంటుందని తెలిపారు. ఒక ఏడాది నుంచి 10 సంవత్సరాలలోపు సుకన్య యోజన ఆడపిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని, అధిక బెనిఫిట్‌ కలుగుతుందని వివరించారు. ఈ తనిఖీలలో స్టెనో సిహెచ్‌ రాజేష్‌ బాబు, బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ చిలకా శ్రీనివాసరావు పాల్గొన్నారు.