ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన హర్ ఘర్ తిరంగా విజయవంతం నేపథ్యంలో, ఈ ఏడాదీ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, శ్రీకాకుళం హెడ్ పోస్టుమాస్టర్ డి.చంద్రశేఖర్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని పోస్టాఫీసుల్లో పది వేల జాతీయ జెండాలను అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన జాతీయ జెండాలను రూ.25కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసుల్లో జాతీయ జెండాలను కొనుగోలు చేసి ఇంటిపై అమర్చుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పోస్టల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా నాడు, నేడు అందిస్తున్న పోస్టల్ సేవలను ప్రజలకు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.










