ప్రజాశక్తి - కలెక్టరేట్ : మేజర్ పోర్టుల అథారిటీ చట్టం, నేషనల్ మోనిటైజేషన్ పైపులైన్ అమలును నిలుపుదల చేయాలని యునైటెడ్ పోర్టు అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు విఎస్.పద్మనాభరాజు డిమాండ్ చేశారు. యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎఎంపి (నేషనల్ అసెట్స్)లో భాగంగా పోర్టుల బెర్తులు (డబ్ల్యుక్యు, 7, 8, ఇక్యు-6,7) అమ్మకానికి వ్యతిరేకంగా, ఎంపిఎ యాక్ట్ అమలులో భాగంగా ల్యాండ్ లార్డ్ పోర్టులుగా మార్చడానికి వ్యతిరేకంగా, కార్మిక చట్టాలు మార్పు, కుదింపునకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. షరతులు లేని కొత్త వేతన ఒప్పందం సత్వరం చేయాలన్నారు. పాత ఒప్పందం మేరకు బోనస్ పూర్తిగా చెల్లించాలన్నారు. పోర్ట్ స్టేడియం, కల్యాణ మండపాలను ప్రయివేటుపరం చేయ రాదన్నారు. పోర్టులను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా విఎస్.పద్మనాభరాజు, అధ్యక్షులుగా డి.సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కె.సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా సిహెచ్.త్రినాథరావు, అర్గనెజింగ్ కార్యదర్శిగా వి.ఈశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కెఎస్. కుమార్, శోభన్ కూమార్, అప్పలరాజు, సోమేశ్వరరావు, కార్యదర్శులుగా బి.జగన్, కె.శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావులతోపాటు 23 మందితో కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కార్యక్రమంలో స్టీల్ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి.గంగారావు, బి.జగన్ ఉన్నారు.










