Jan 29,2023 23:54

సమావేశంలో మాట్లాడుతున్న మసేను

ప్రజాశక్తి- మాధవధార : పోర్టుల ప్రయివేటీకరణను అడ్డుకోవాలని విశాఖపట్నం పోర్టు ట్రస్టు మాజీ సభ్యులు బిసిహెచ్‌ మసేను కోరారు. హార్బర్‌ అండ్‌ పోర్టు పెన్షనర్స్‌, వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వనభోజన కార్యక్రమం మాధవధార తోటలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిసిహెచ్‌.మసేను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటైన ప్రభుత్వ పరిశ్రమలను గుజరాత్‌ కార్పొరేట్‌ సంస్థలకు మోడీ తెగ నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్‌దారులకు ఆసుపత్రి సౌకర్యాలను ప్రయివేటుపరం చేస్తున్నారని తెలిపారు. మోడీ పాలనతో నిరుద్యోగం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రానున్న రోజుల్లో పింఛను వచ్చే అవకాశం తగ్గుతుందని తెలిపారు. పింఛన్‌దారులంతా ఒకే తాటిపై ఉండి పోరాటాలకు సిద్ధపడాలని కోరారు. అనంతరం అసోసియేషన్‌ చైర్మన్‌ సనపల బంగారు రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు చౌదరి అప్పారావు, ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌రావు, అడ్వయిజర్‌ అన్నెపు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.