ప్రజాశక్తి-కలెక్టరేట్ : విశాఖపట్నం పోర్టును ప్రయివేటీకరణ చేయటానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను వ్యతిరేకిస్తూ ఉధృత పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డు అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు విఎస్ పద్మనాభరాజు పిలుపు ఇచ్చారు. యూనియన్ జనరల్ బాడీ సమావేశం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగింది. విశాఖపట్నం పోర్టు బెర్తులు, హాస్పటల్, కల్యాణ మండపాలు, కళావాణి, ఖాళీ స్థలాలు, బిల్డింగ్స్ ప్రయివేటుపరం చేసేందుకు బిజెపి ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని, ఈ దూకుడుకి అడ్డుకట్ట వేయడానికి, పోర్టులను రక్షించుకోవడానికి మిగిలిన కార్మిక సంఘాల్ని, ప్రజాసంఘాల్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పద్మనాభరాజు చేసిన సూచన మేరకు సమావేశం ఒక తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పద్మనాభరాజు మాట్లాడుతూ, కార్మిక, స్థానికుల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాసంఘాలు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థిని గెలిపించడంలో ప్రతి సభ్యుడూ కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం కమిటీ ఎన్నికలు జరిగాయి.
కమిటీ ఎన్నిక
యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఎస్.పరశురాం, అధ్యక్షులుగా జె.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బి.లక్ష్మణరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.జగన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్.నర్సింగరావు మరో తొమ్మిది మంది ఆఫీస్ బేరర్స్ మొత్తం 20 మంది కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎల్లారావు, తాతారావు, భాను, కె.జగన్నాధరావు తదితరులను సత్కరించారు.










