
ప్రజాశక్తి -మాధవధార : గోల్డెన్ జూబ్లీ (పోర్టు)హాస్పిటల్ ప్రయివేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ హార్బర్ అండ్ పోర్ట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన సోమవారం ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు చౌదరి అప్పారావు అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి విశాఖపట్నం పోర్టు ట్రస్టు మాజీ ట్రస్టీ సిహెచ్ మసేను మాట్లాడుతూ, పోర్టు పింఛన్దారులు చాలీచాలని పింఛన్లతో కాలం వెల్లదీస్తున్నారని, ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. పింఛన్దారులంతా ఒక తాటిపైకి వచ్చి ఆసుపత్రి ప్రయివేటీకరణను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆసుపత్రిని నిర్వహించాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రకాశరావు, కోశాధికారి అన్నపు నారాయణరావు, కె.స్వతంత్రకుమార్, బి.లక్ష్మణరావు, రామారావు, రాజు, అధిక సంఖ్యలో పెన్షన్దారులు పాల్గొన్నారు.