Aug 10,2023 20:46

కానిస్టేబుల్‌ కేశవను పరామర్శిస్తున్న వైసిపి నాయకులు

వాల్మీకిపురం : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులలో బందోబస్తు విధుల నిర్వహణలో ఉన్న పోలీసులపై టిడిపి గూండాలు దాడులకు పాల్పడడం అమానుషమని వైసిపి నాయకులు తీవ్రంగా ఖండించారు. ముదివేడు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కేశవ టిడిపి గూండాల దాడిలో గాయపడి స్వస్థలమైన వాల్మీకిపురం మండలం శివపురంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వాల్మీకిపురం వైసిపి నాయకులు గురువారం శివపురంలోని కానిస్టేబుల్‌ కేశవ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ కేశవ ఆరోగ్య పరిస్థితిని విచారించి, దాడి ఘటనను ఖండించారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీసులపైనే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులను దాడులకు ఉసిగొల్పడం శోచనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన నేత ఇలాంటి దురాగతాలకు ఊతమివ్వడం ఆయన నీచమైన, దిగజారుడు బుద్ధులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రం సహా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో టిడిపి అధినేత చంద్రబాబు ఫ్రస్టేషన్‌కు గురై నీతి బాహ్యమైన రాజకీయాలకు దిగజారారని, టిడిపి గుండాల దాడులలో గాయపడిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బిడ్డల కేశవరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌, నాయకులు శ్రీధర్‌ రాయల్‌, నీళ్ల భాస్కర్‌, మదన్మోహన్‌ రెడ్డి, రవి, రెడ్డప్ప రెడ్డి, సాధిక్‌, షాహిద్‌, రమణ, ఆషర్‌ పాల్గొన్నారు.గాయపడిన