Oct 21,2023 22:52

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన భాద్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి ఇ.భీమరావు, జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు ఆర్మ్డ్‌ రిజర్వు పరేడ్‌ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మతి పరేడ్‌ నిర్వహించారు. చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్‌ జడ్జి ఇ.భీమరావు, జిల్లా ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్‌ రెడ్డి, ఐఎఫ్‌ఎస్‌.లు స్మతి పరేడ్‌కు హజరై, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా జడ్జి భీమరావు మాట్లాడుతూ... పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామని అన్నారు. ప్రజాశ్రేయస్సు, శాంతిభద్రతలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలనులోడ్డి విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు. జిల్లాలోని పోలీసులు అండగా ఉంటూ అనేక రకాలుగా వారిని ఆదుకుంటామన్నారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు. విద్యార్థులు, సమాజంలో ఉన్న ప్రజలు క్రమశిక్షణతో మెలిగేందుకు అవగాహన సదస్సులు కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా ఎస్పీలను కోరుతున్నామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యతన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. శాంతిభద్రతల కట్టడిలో పోలీస్‌వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తున్న పోలీసులను సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజారక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఆగష్టు నెలలో పుంగనూరులో అల్లరి మూకల దాడిలో చిత్తూరు పోలీసులు 50మంది వరకు గాయాలపాలైనారు. ఒక కానిస్టేబుల్‌ తన కంటిచూపును సైతం పోగొట్టుకున్నారు. అల్లరి ముష్కరులు ఇంతటి విధ్వంసం చేసిన పోలీసు వారు తమ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రజల శాంతికి భంగం వాటిల్లకుండ లా అండ్‌ ఆర్డర్‌ ను కాపాడుటలో తమదైన నేర్పును ప్రదర్శించారు.
అమరులైన అందరి కోసం శ్రద్దాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబాల వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. జిల్లా అటవీశాఖ అధికారి మాట్లాడుతూ 1959 అక్టోబర్‌ 21న జరిగిన దురదష్ట సంఘటనను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను సంస్మరణం చేసుకోవడం కోసం ప్రతిఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. కరోన లాంటి ప్రమాదకరమైన వైరస్‌ ప్రపంచం అంతటా వ్యాప్తి చెందినప్పుడు అందరు ఇళ్ళకు పరిమితమైన కూడా ఒక్క పోలీసు మాత్రమే వారి విధి నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు.