పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా సేవలు
గంజాయి నేరాల్లో పట్టుబడే వారిపై పిడి యాక్ట్
కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ పై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. ముందుగా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, ఆళ్లగడ్డ డిఎస్పీ బి.వెంకట రామయ్య, ఆళ్లగడ్డ టౌన్ సిఐ ఎం.రమేష్ బాబు, సిరివెళ్ల సిఐ చంద్రబాబు నాయుడు, ఎస్సై వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ లోని ఎస్సైలు, సిబ్బంది స్వాగతం పలికారు . ఈ సందర్భంగా పలు రికార్డులను మరియు స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీ జరుగుతూ ఉంటుందని, ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎలా ఉంది.. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది వివరాలు, వారు ఏ విధంగా పనిచేస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో రికార్డు మెయింటెనెన్స్ ఎలా ఉంది కేసుల స్థితిగతులు ఎలా ఉన్నాయి మొదలగు వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పోలీసు అదికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ల పరిధిలో నేర నియంత్రణ,శాంతి భద్రతల పరిస్థితిలు మరియు అసాంఘిక కార్యకలాపాల గురించి నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల గురించి ఆరా తీశారు. మహిళలపై జరుగుచున్న నేరాలపై ప్రత్యక దృష్టి ఉంచాలని , దర్యాప్తులో ఉన్న కేసులలో వృత్తి నైపుణ్యతతో శాస్త్రీయ పద్ధతులలో దర్యాప్తు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. స్టేషన్ లో ప్రతి ఒక్క రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్, దిశ యాప్ రిజిస్టేషన్ మరియు డయల్ 112, 100 నంబర్లు వాటి ఉపయోగం గురించి విద్యార్ధులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాల నివారణ కొరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. విధినిర్వహణలో రోల్ క్లారిటీతో సమర్థవంతంగా పని చేయాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ, ఫిర్యాదుదారుల తో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని తెలియజేశారు. అనంతరం వార్డు మహిళ కార్యదర్శులతో మాట్లాడి వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రతి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని మీకు కేటాయించిన విధులలో సంతృప్తికరమైన స్థాయిలో పనిచేయాలని తెలియజేశారు. పట్టణంలోని రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, రాంగ్ రూట్, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ లపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
గంజాయి నేరాల్లో పట్టుబడే వారిపై పిడి యాక్ట్ : కర్నూలు రేంజ్ పరిధిలో గంజాయి సాగు, రవాణా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ తెలిపారు. పట్టణ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి నేరాలలో పట్టుబడితే నేరస్తులకు 6 నెలల పాటు జైల్లో ఉంచేలా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిపీటెడ్ గా గంజాయి నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేసి రౌడీ షీట్లను కూడా ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల విషయాన్నికొస్తే ఇక్కడ ట్రాఫిక్ తదితర ఎలాంటి సమస్యలు పెద్దగా లేవని గమనించడం జరిగిందన్నారు ఇటీవల మహానంది మండల వార్త విలేఖరి మధు పై జరిగిన దాడిని గురించి విలేకరులు ప్రశ్నించగా ఈ విషయంపై బాధ్యులపై కేసు నమోదు అయిందని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










