
ప్రజాశక్తి - ఆరిలోవ : పోలీస్ శాఖకు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం వెన్నెముక వంటిదని ఆర్మ్డ్ రిజర్వ్ అదనపు ఎస్పిలు బి.విజయభాస్కర్, వి.సత్తిరాజు అన్నారు. కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సాయుధ దళాల వార్షిక మొబలైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ శిక్షణలో సిబ్బంది అంకిత భావం, ఏకాగ్రతతో నేర్చుకోవడం ద్వారా విధులలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. శాంతి భద్రత సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో బంద్లు, నిరసనలు, ఘెరావ్, రాస్తారాకోలు, అక్రమ సమావేశం చెదరగొట్టడంలో మాబ్ ఆపరేషన్ నిర్వహించడంలో రిజర్వ్ పోలీసులు తమ పనితీరును మెరుగు పరచుకునేందుకు 15 రోజుల పాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, ఆరవింద్ కిషోర్, వెంకటరావు, సతీష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.