Oct 25,2023 23:43

వీడియో కాన్ఫరెన్సులో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో ఇటీవల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయని, వాటిని పన్ను పరిధిలోకి తీసుకొని పన్ను మదింపు చేసి నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఎంపిడిఓ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి పంచాయతి పరిధిలో సర్వే నిర్వహించి పన్ను మదింపు చేయని ఆస్తులు, తక్కువగా మదింపు చేసిన ఆస్తుల వివరాలు సేకరించి సరైన రీతిలో పన్ను మదింపు చేసి నోటీసులు జారీ చేయాలని, వాటిపై వచ్చిన ఫిర్యాదులను తగు రీతిలో పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా పూరి గుడిసెలలో ఉన్న వారికి పన్ను మినహాయింపు ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేసారు. అదేవిధంగా నిర్మాణాలు కట్టబడిన సంవత్సరం ఆధారంగా పన్ను మదింపు చేయాలన్నారు. పంచాయతి కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది రెండు పూటలా ముఖ హాజరు తప్పనిసరిగా వేసి నివేదించాలని ఆదేశించారు. పంచాయతీల పరిధిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ప్రతి పక్షానికి ఒక సారి ట్యాంకులు శుభ్రపరచాలని ఆదేశించారు. అదేవిధంగా తాగునీటి సరఫరాపై ప్రత్యెక దృష్టి సారించాలన్నారు. జనన మరణ ఆలస్య నమోదు లను గుర్తించి త్వరితగతిన ద్రువపత్రాలు జారీ చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కింద అవసరమైన వారికి పని కల్పించాలని ఆదేశించారు. 150 పని దినాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వారికి బ్యాంకు ఖాతాలు తెరవడంలో అడ్డంకులను పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో చర్చించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. జాబ్‌ కార్డుల జారీ సక్రమంగా చేపట్టాలని, తొలగించిన జాబ్‌ కార్డులపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేయించాలని, అందుకు ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు సహకరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ జమాల్‌ బాషా, జిల్లా పంచాయతి అధికారి కొండలరావు, డివిజినల్‌ పంచాయతి అధికారి పిఎస్‌ కుమార్‌, డిబిటి మేనేజర్‌ నరేశ్‌, ప్రాజెక్ట్‌ అధికారులు, వి.అభిషేక్‌, చైతన్య, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఒలు తదితరులు పాల్గొన్నారు.