ప్రజాశక్తి-రామభద్రపురం : ప్రతీ పంటను తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వి.టి.రామారావు రైతులకు సూచించారు. సోమవారం మండలంలో కొండకెంగువ రైతు భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించి, రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వం ఆర్బికె ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పంపిణీ చేస్తుందన్నారు. అనేక రకాల రాయితీలు అందిస్తుందని తెలిపారు. నమోదు చేసుకున్న ప్రతి పంటను ఇకెవైసి చేయించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు ఇకెవైసి తప్పనిసరి అన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు, సేంద్రియ ఎరువులు వాడకం వంటివి అవలంబించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకొని అధిక రాబడులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎడి శ్యామ్సుందర్, వ్యవసాయ అధికారి వెంకటయ్య, ఆర్బికె సిబ్బంది పాల్గొన్నారు.










