పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలి : రైతు సంఘం
ప్రజాశక్తి - ఆత్మకూర్
ఆత్మకూర్ మండలంలోని చిన్నవాగునుండి పెద్దగా వాగు లోనికి వడ్ల రామాపురం గ్రామ బీటి రోడ్డు సైడ్ నుండి కాలువ తీసి సాగునీరు అందిం చాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఏపీ రైతు సంఘం మండల కమిటీ సమావేశం కురుకుంద మా బాష అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పలుమార్లు ఈ విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లిన అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. దాదాపు 400 ఎకరాలకు సాగునీరు అందించే ఈ చిన్న పనిని చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. గతంలో రైతులు ఈ ప్రాంతపు కౌలు రైతులు ఆందోళనలు నిర్వహించాలని స్పందన కార్యక్రమంలో అర్జీలు సైతం ఇచ్చారన్నారు. ఇరిగేషన్ అధికారులు తూతూ మంత్రంగా ఈ కాలువకు సంబంధించిన ఎస్టిమేషన్ వేసి అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ కాల్వ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, రైతు సంఘం నాయకులు కే రాముడు, ఆదినారాయణ, అంబయ్య, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏపీ రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా వీరన్న, సహాయ కార్యదర్శులుగా కృష్ణమోహన్, అధ్యక్షులుగా మహబూబ్ బాషాలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










