జిల్లా పరిషత్తు సమావేశంలో జెడ్పిటిసి జ్యోతి
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని అప్పలరాజుపేటలోని అమ్మాయి గొప్ప, జడ్డంగి మడేరు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజవొమ్మంగి జెడ్పిటిసి ఒడుగుల జ్యోతి అధికారులకు విన్నవించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం కాకినాడలోని జెడ్పి మందిరంలో బుధవారం జరిగింది. ఇందులో పాల్గొన్న జెడ్పిటిసి వడుగుల జ్యోతి మాట్లాడుతూ, రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలో అమ్మైగొప్పు చెరువు నుండి పొలాలకు సాగునీరు అందే కాల్వలో చెత్త, చెదారం పేరుకుపోవడంతో గతంలో రైతులందరూ కలిసి సొంతంగా పూడిక తీత పనులు చేపట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ యథా స్థితిలో ఉందని, రైతులకు సాగునీరు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి లేదని తెలిపారు. జడ్డంగిలో మడేరు వాగుకి ఆనుకొని ఉన్న ఎడమ, కుడి కాల్వలు జంగిల్, పూడిక తీయకపోవడం వలన రైతులకు ఒక పంటకే పూర్తిగా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇరిగేషన్ అధికారులకు ఎన్ని మార్లు తెలిపిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంవత్సరం అయిన పంట కాలువలో జంగిల్ కటింగ్, పూడిక తీత పనులు చేపట్టి రైతులకు సాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.










