చండీగఢ్ : 76 ఏళ్ల మహిళా ముఖ్యమంత్రి రాజీందర్ కౌర్ భట్టల్ పంజాబ్ ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. 1996-97లో మూడు నెలలపాటు సిఎంగా వ్యవహరించే అవకాశం దక్కడంతో.. పంజాబ్ రాష్ట్రానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించిన మహిళగా రాజీందర్ కౌర్ రికార్డులకెక్కారు. ప్రస్తుతం ఆమె లెహ్రా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున మరోసారి పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థిగా శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) నుండి పర్మీందర్సింగ్ ధిండ్సా పోటీపడుతున్నారు. 1992 నుంచి అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చిన రాజీందర కౌర్ 2017లో మాత్రం ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ధిండ్సా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుబడుతున్నారు. అయితే గత ఎన్నికల వరకు ఇక్కడ కాంగ్రెస్, అకాలీదళ్ల మధ్య ద్విముఖంగా మాత్రమే ఉండేది. ఈ సారి ఆప్ కూడా బరిలోకి దిగింది. ధిండ్సా ప్రధాని మోడీ ప్రతినిధి అని విమర్శిస్తున్నారు.










