Jan 08,2023 00:31

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న కృష్ణంరాజు

ప్రజాశక్తి-సింహాచలం: పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సింహాచలంలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం నాయకులు టివి.కృష్ణంరాజు బి రమణి మాట్లాడుతూ, పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి నేటికీ పరిష్కరించలేదన్నారు. పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసి మూడున్నరేళ్లు గడిచినా అతీగతీ లేదన్నారు. సింహాద్రి దేవస్థానం వద్ద 1996లో గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా తప్ప ఎటువంటి ఆధారాలూ లేవన్నారు. 1903లో జరిగిన గిల్మన్‌ సర్వే తర్వాత ఎటువంటి సమగ్ర అధికారిక సర్వే జరగలేదని తెలిపారు. 1903లో జరిగిన సర్వే సెటిల్‌మెంట్‌ రికార్డుల ప్రకారం 1785 ఎకరాలు జిరాయితీ భూములుగా అనేక మంది రైతులు పేర్లు ఉన్నాయని చెప్పారు. దేవస్థానానికి కేవలం 39.5 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రికార్డుల ద్వారార స్పష్టమవుతోందని తెలిపారు. ప్రస్తుతం ఎవరి ఆధ్వర్యంలో ఉన్న ఇల్లు స్థలాల్లో వారు మరమ్మతులు సహా నిర్మాణాలను అనుమతించాలని, సింహాచల దేవస్థానానికి 1996- 97 లలో ఇచ్చిన అక్రమ పట్టాల రద్దుచేయాలని, దేవస్థానం దాడులను అరికట్టాలని. 1903 సర్వే సెంటిమెంట్‌ గిల్మన్‌ రికార్డు ఆధారంగా భూ హక్కు జారీని గుర్తించాలని నినదించారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. ధర్నా అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం సభ్యులు సూర్యారావు, బి.అరుణ్‌కుమార్‌, ఎం.రాంభద్రరావు, ప్రసాద్‌, సత్యనారాయణ, తెలుగు యువత అధికార ప్రతినిధి సత్తివాడ శంకరరావు పాల్గొన్నారు.