Feb 14,2023 23:54

కశింకోటలో ప్రచారం నిర్వహిస్తున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ

ప్రజాశక్తి - అనకాపల్లి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని తుమ్మపాల, కొత్తూరు, నరసింగరావుపేట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైల్వే జోన్‌ ఇవ్వాలని, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను, బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఒపిఎస్‌ సాధన కోసం, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది క్రమబద్ధీకరణ వంటి అంశాలపై పోరాడుతానన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం, మహిళల సమానత్వం కోసం పోరాడుతానన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జె.రమేష్‌ బాబు, ఆర్‌.శంకరరావు, గంటా శ్రీరామ్‌, కె.తేలయ్య బాబు, రమణ, తరుణ్‌ పాల్గొన్నారు.
కశింకోట : మండల కేంద్రంలో పలుచోట్ల రమాప్రభ ప్రచారం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు డిడి.వరలక్ష్మి, ఎ.బాలకృష్ణ, దాకారపు శ్రీనివాసరావు, ఆర్‌.శంకరరావు, జి.శ్రీరామ్‌, రమేష్‌, తరుణ్‌, రమణ పాల్గొన్నారు.