Aug 16,2023 23:11

ప్రజాశక్తి-నందిగామ: ఈ నెల 19, 20 తేదీల్లో విజయవాడలో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా ప్లీనరీ సమావేశాలు జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కార్యదర్శి గోపి నాయక్‌ పేర్కొన్నారు. బుధవారం నందిగామ కెవిఆర్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ రాయప్ప పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపినాయక్‌ మాట్లాడుతూ విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణను ఎస్‌ఎఫ్‌ఐ వ్యతిరేకిస్తుందన్నారు. విద్యారంగ పరిరక్షణ, శాస్త్రీయ విద్యా విధానం,విద్యాహక్కు చట్టం అమలు, యూనివర్శిటీ గ్రాంట్స్‌ పెంపు, సంక్షేమ హాస్టల్స్‌ మౌళిక సదుపాయాలు, అద్దె భవనాల స్థానంలో సొంత భవనం నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాల, మున్సిపల్‌ పాఠశాలల్లో నాడు-నేడు పనులు ప్రారంభించాలని, 3, 4, 5 తరగతుల విలీనం ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు షేక్‌ కాజు, హషేన్‌, రఘు, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.