Feb 07,2023 23:51

ప్లాస్టిక్‌ నిర్మూలనపై అవగాహన అవగాహనలో అదనపు కమిషనర్‌ సన్యాసిరావు

ప్రజాశక్తి - మధురవాడ : ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించేందుకు యువత సహకారం అవసరమని, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి వారు ముందుకు రావాలని జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో మంగళవారం జీవీఎంసీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్లాస్టిక్‌, చెత్త రహిత విశాఖ నగరంలో యువత పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పరోక్షంగా ప్రకృతి, వివిధ జీవరాశుల నుంచి తిరిగి మనిషి ఆహరంలోకి చేరుతోందని తద్వారా కేన్సర్‌ వంటి రోగాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించడం పెరగాలని, ప్రజల జీవన శైలి అందుకు అనుగుణంగా మారాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వంటి యువసేవా విభాగాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులకు ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై లఘుచిత్ర పోటీలను నిర్వహించాలని సూచించారు. జివిఎంసి ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి మాట్లాడుతూ, నగరంలో ప్రతి రోజూ 9 వేల టన్నుల వ్యర్థాలు డంపింగ్‌ యార్డుకు చేరుతున్నాయని, దీని ద్వారా 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన జరుగుతుందని తెలిపారు. తడి, పొడి వ్యర్థాలను ఇంటి వద్ద వేరు చేసి వాటి నుంచి ప్రయోజనకర ఎరువులను తయారుచేస్తున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలు సహకరిస్తే విశాఖ బీచ్‌ను, పర్యాటక ప్రాంతాలను, వార్డులను పరిశుభ్రంగా ఉంచుతూ స్వఛ్ఛ సర్వేచ్ఛణ్‌లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించవచ్చునన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రోవైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమరావు మాట్లాడుతూ, గీతం విద్యార్థులు బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమాల ద్వారా నగర పరిశు భ్రతకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ కనకమహలక్ష్మి, గీతం స్టూడెంట్‌ లైఫ్‌ డిప్యూటీ డైరక్టర్‌ రాహుల్‌సింగ్‌, ఎన్‌సిసి అధికారి మేజర్‌ డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.