- ఖుర్దా రోడ్డు డిఆర్ఎం హర్భజన్ సింగ్ బజ్వా
ప్రజాశక్తి - పలాస: అమృత్ భారత్ పథకంలో భాగంగా ఎంపికైన పలాస రైల్వేస్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు ఈస్ట్కోస్ట్ రైల్వే ఖుర్దా రోడ్డు డిఆర్ఎం హర్భజన్ సింగ్ బజ్వా తెలిపారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన పలాస రైల్వేస్టేషన్ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్ఫారం, వేచి ఉండే గదులు, పార్కింగ్, సిబ్బంది విశ్రాంత మందిరాలు, ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలు, టిక్కెట్ కార్యాలయాన్ని పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్ పథకంలో పలాస రైల్వేస్టేషన్ను చేర్చడం వల్ల రైళ్లు నిలుపుదలతో పాటు రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయడానికి కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డిఒఎం కె.సందీప్, డిఇఇ పి.కె ప్రదాన్, డిఇఇ (జనరల్) ఎస్.కె రౌత్, ఎసిఎం మనోజ్ సింగ్, పలాస రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.










