
ప్రజాశక్తి-మధురవాడ : ప్రణాళిక ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ పి.రాజాబాబు ఆదేశించారు. జివిఎంసి 8వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్మిస్తున్న పలు భవనాలను పట్టణ ప్రణాళికాధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్లానుకు విరుద్ధంగా నిర్మించే భవనాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్లానులు మంజూరు చేసేటప్పుడు స్థలానికి వెళ్లి ఆయా ప్రాంతాలను పరిశీలించిన తరువాత అన్ని సక్రమంగా ఉంటేనే ప్లాను ఇవ్వాలని చెప్పారు. ఎంవివి గ్రీన్ షీల్డ్ అపార్ట్మెంట్, పరదేశిపాలెంలోని అపార్ట్మెంట్లను ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నదీ, లేనిదీ పరిశీలించారు. భీమిలి వల్లభా ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ లే-అవుట్ను పరిశీలించి రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ తదితరాలు ప్లాన్ ప్రకారం ఉన్నవీ లేనివీ పరిశీలించారు. వంద ప్లాట్లు దాటిన అపార్ట్మెంట్లకు చుట్టూ స్థలం, ఎస్టిపి ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం ఆమోదానికి వచ్చిన ప్లాన్లు చాలా జాగ్రత్తగా పరిశీలించి భవనాల నిర్మాణం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పట్టణ ప్రణాళికాధికారి సురేష్, డిసిపి పద్మజ, ఎసిపి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.