Sep 24,2023 21:51

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ అనిత

ప్రజాశక్తి-విజయనగరం :  ఎపిపిఎస్‌సి ద్వారా పలు పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షలు పక్కాగా నిర్వహించాలని డిఆర్‌ఒ అనిత ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 6 వరకు ఈ పరీక్షలు గాజులరేగలోని సత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉదయం 9.30 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైతే 144 సెక్షన్‌ అమలు చేయాలని సూచించారు. అభ్యర్థులకు తాగు నీటి సదుపాయాన్ని కలిగించాలని, నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండాలని, తగు బందోబస్తును ఏర్పాటు చేయాలని, అత్యవసర మందులతో మెడికల్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో పోలీస్‌, వైద్య సరోగ్య, విద్యుత్‌ శాఖల అధికారులు, ఎపిపిఎస్‌సి ప్రతినిధులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌దేవ్‌ ప్రసాద్‌, సత్యకాలేజీ ప్రతినిధులు పాల్గొన్నారు.