మదనపల్లె అర్బన్ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని జిల్లా పంచాయతీ అధికారి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ ధనలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్షపై సన్నద్దతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. ప్రతి వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటిని ఆరోగ్య కార్యకర్త, సిహెచ్ఒ సర్వే చేసి, ఆ కుటుంబానికి అవసరమైన వైద్యాన్ని అందించమే ఆరోగ్య సురక్ష ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ముందుగా క్లస్టర్స్ వారీగా వాలంటీర్లు ఆయా కుటుంబాలకు ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పిస్తారని, అనంతరం ఎఎన్ఎం, సిహెచ్ఒ ఆ కుటుంబాలను సందర్శించి, వారి పూర్తి వివరాలను ఆరోగ్యశ్రీ యాప్లో నమోదుచేస్తారని చెప్పారు. మండల పరిధిలోని 22 విహెచ్సిలలో రెండు బందాలుగా క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందజేయడం జరుగునని తెలిపారు. క్యాంపులు నిర్వహించే ప్రదేశం పాఠశాలలో ఉన్నట్లైతే క్యాంపు డే రోజు సెలవు మంజూరు చేయాలని ఎంఇఒకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్.భానుప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ ఎ.బావజాన్, బొమ్మనచేరువు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, అదనపు డాక్టర్ ఎం.మహ్మద్ఫర్ఖాన్ సిటిఎం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జాన్సీ, చెంబకూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నూరుల్లా, పంచాయతీ కార్యదర్శులు, ఎఎన్ఎంలు, సిహెచ్ఒలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.










