ప్రజాశక్తి-తెర్లాం : పిటిషన్ల తీవ్రతను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. పిటిషనర్ల తో స్నేహ పూర్వకంగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. బుధవారం తెర్లాం మండలంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. గడువు లోగా వినతులను పరిష్కరించాలని తెలిపారు. మొత్తం 48 వినతులు అందాయి. వీటిలో ఎక్కువగా రెవిన్యూ కు చెందినవి 20 కాగా సోషల్ వెల్ఫేర్ శాఖ కు చెందినవి 13 , హౌసింగ్కు 2 , విద్యుత్ శాఖకు సంబంధించినవి 4 , వెటర్నరీకి సంబంధించి 2, వైద్య విధాన పరిషత్, ఉన్నత విద్య, వ్యవసాయం, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, సర్వే, పంచాయతి రాజ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వినతులు అందాయి. వినతుల స్వీకరణలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, బొబ్బిలి ఆర్డిఒ శ్రీ సాయి, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఎంపిడిఒ రామకృష్ణ, తహశీల్దార్ రత్నకుమార్, జిల్లా స్థాయి , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.