Dec 27,2022 23:37

ఆందోళన చేస్తున్న పింఛన్‌ లబ్ధిదారులు, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరణ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, సుంకరమెట్ట సర్పంచ్‌ గెమ్మెలి చిన్నబాబు డిమాండ చేశారు. మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ పరిధి వివిధ గ్రామాల్లో తొలగించిన పింఛన్‌లు వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం అరకువేలి సబ్‌ స్టేషన్‌ వద్ద పింఛన్లుదారులతో ధర్నా చేశారు. ఈ సంధర్భంగా వారు మట్లాడుతూ, కరెంట్‌ 300 యునిట్లు దాటి వస్తుందనే సాకుతో పెన్షన్లు తొలగిం చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.గిరిజన మారుమూల గ్రామాల్లో కరెంటు సక్రమంగా ఉండదని, ఇలాంటి పరిస్థితిలో ఎలా 300 యూనిట్లు వస్తుందన్నారు. భూములు ఎక్కువ ఉందనే సాకుతో పింఛన్‌ తొలగించడం ఎంతవరకు సమంజసం అన్నారు.పెన్షన్లు తొలగింపుపై ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే తొలగించిన పింఛన్లను పునరుద్ధరణ చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌.బాబురావు, జి సన్యాసిరావు, జి.శ్యాంసుందర్‌, జి.కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.