ప్రజాశక్తి-జగ్గయ్యపేట
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారమే పెన్షన్లను పెంచారని శాసనసభ్యులు సామి నేని ఉదయభాను అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కొత్తగా మంజూరైన పెన్షన్లను ఉదయభాను అందజేశారు. అనంతరం రెండో వార్డ్ కౌన్సిలర్ వి. మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉదయభాను మాట్లాడుతూ పట్టణంలో 159 కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. జగ్గయ్యపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. జగ్గయ్యపేట పట్టణం నుండి చిల్లకల్లు వరకు 14 లక్షల రూపాయలతో ఫోర్ వే నిర్మాణం, జగ్గయ్యపేట చెరువు బోటు షికారి, వాకింగ్ రోడ్డు, చెరువు చుట్టూ సుందరమైన చెట్లతో పార్కుల ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ పాల్గొన్నారు.










