
ప్రజాశక్తి -యంత్రాంగం
మధురవాడ : జివిఎంసి 7వ వార్డు పరిధి చంద్రంపాలెం గ్రామ రచ్చబండ వద్ద పెంచిన పెన్షన్లు ఆదివారం పంపిణీ చేశారు. గత నెల వరకు రూ.2500ఉన్న పింఛను జనవరి 1వ తేదీ నుంచి రూ. 250 పెంచి రూ.2,750 చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, నాయకులు పిళ్లా సూరిబాబు, పివిజి.అప్పారావు, పోతిన పైడిరాజు, జగుపిల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం : ఆనందపురం సర్పంచ్ చందక లక్ష్మి ఆధ్వర్యాన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్లు రూ.2,750 చొప్పున ఆదివారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో చందక సూరిబాబు, షిణగం రామారావు, చందక అప్పలస్వామి, శంకర్, వార్డు మెంబర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.
భీమునిపట్నం : వైసిపి ప్రభుత్వం సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు స్థానిక వైసిపి కార్యాలయం ప్రాంగణంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జివిఎంసి పరిధి 4 వార్డుల్లో ప్రస్తుతం 8,448 పింఛన్లు ఉండగా, వీటికి అదనంగా 332 పింఛన్లు మంజూరైనట్లు వివరించారు. పింఛన్ల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జివిఎంసి 1, 3, 4 వార్డుల కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, గంటా అప్పలకొండ, దౌలపల్లి కొండబాబు, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.