Feb 04,2023 23:46

సమావేశంలో మాట్లాడుతున్న డిఇఒ చంద్రకళ

ప్రజాశక్తి-పద్మనాభం : 6 నుంచి 14 సంవత్సరాలు వయసున్న పిల్లలు విద్యకు దూరం కాకూడదని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ పేర్కొన్నారు. పాండ్రంగిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలకు విద్యార్థిని హాజరుకాకపోవడాన్ని గమనించారు. పాఠశాలకు రాని విద్యార్థిని ఇంటికి వెళ్లారు. ఇంటి వద్ద లేకపోవడంతో ఆరా తీసారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఇటుక బట్టీలో పని చేస్తోందని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. విద్యార్థిని అక్కడ ఇటుకలు తయారీ పనిలో ఉండటాన్ని గమనించారు. సమీపంలో ఉన్న ఇటుక బట్టీలను కూడా పరిశీలించారు. ఒడిశాకు చెందిన విద్యార్థులు కూడా అక్కడ ఉండటాన్ని గమనించారు. ఇటుక బట్టీలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. సుమారు 300 ఇటుక బట్టీలు ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే ఇటుక బట్టీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని ఎంపిపికె.రాంబాబు, జెడ్‌పిటిసి సుంకర గిరిబాబును కోరారు. దీనిపై శనివారం ఎంపిడిఒ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేశారు. బడిఈడు పిల్లలను పాఠశాలకు పంపించే బాధ్యత మన అందరిపైనా ఉందని, దీనికి సహకరించాలని నిర్వాహకులను డిఇఒ కోరారు. దీనిపై నిర్వాహకులు స్పందిస్తూ ఒడిశా విద్యార్థుల కోసం పదేళ్ల నుంచి ప్రత్యేక పాఠశాల ఏర్పాటుచేసి 50 మందికి విద్య అందిస్తున్నట్లు తెలిపారు. దీనిపై డిఇఒ మాట్లాడుతూ, అన్ని ఇటుక బట్టీలలో ఉన్న విద్యార్థులూ ఈ పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు తదితరాలపై కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు చేపడతానని డిఇఒ హామీ ఇచ్చారు. సోమవారం నాటికి విద్యార్థుల ఆధార్‌ నెంబర్లతో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి దుస్తులు, పుస్తకాలు, పలకలు, ఆట వస్తువులు సమకూరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమములో ఎపిసి బి.శ్రీనివాసరావు, డిప్యూటీ డిఇఒ ఎ.గౌరీశంకరరావు, డైటు లెక్చరర్‌ గోట్టి రవి, ఆల్టర్‌నేట్‌ స్కూల్‌ కో-ఆర్డినేటర్‌ ఎ.శైలజ, ఎంఇఒ శివరాణి తదితరులు పాల్గొన్నారు.