
ప్రజాశక్తి- సీతానగరం : మండలంలోని పెదంకలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సందర్శించారు. పిహెచ్సిలో వ్యాక్సిన్ నిల్వలు, వాటి నిర్వహణ పరిశీలించారు. వ్యాక్సిన్ స్టాక్, వినియోగం ఈవిన్ ఆన్లైన్లో పరిశీలించారు. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ శీతోష్ణస్థితి, గడువు కాలం విధిగా పరిశీలించాలని ఫార్మసిస్ట్ను ఆదేశించారు. ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాల న్నారు. అనంతరం ఒపి రికార్డు పరిశీలించి నమో దవుతున్న వ్యాదులు, అందజేసిన చికిత్స పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఐదేళ్లం దరికీ సకాలంలో అందరికీ టీకాలు వేయాలని, ఏదైనా కారణాల వల్ల టీకా వేయబడని పిల్లలను గుర్తిస్తే సత్వరమే టీకా పూర్తి చేయాలన్నారు. ఐరన్ సిరప్స్ వారానికి రెండుసార్లు వేయించి హెచ్ఐ ఎమ్ఎస్లో అప్లోడ్ చేయాలన్నారు. రక్త హీనత, బరువు తక్కువ పిల్లలు, గర్బిణులను గుర్తిస్తే నివారణ చర్యలు త్వరగా చేపట్టాలన్నారు. హై రిస్క్ గర్భిణి చికిత్స కోసం తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ను వినియోగించాలన్నారు. మొదటి కాన్పు, ఆడ శిశువు జన్మించిన రెండవ కాన్పుకు ప్రభుత్వం అందజేస్తున్న పిఎమ్ఎమ్వివై పథకం త్వరగా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జెఎఎస్లో గుర్తించిన రిఫరల్స్ పై దృష్టి సారించాలన్నారు. పిహెచ్సిలో సాధారణ కాన్పులు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇఒ జి. సూర్యనారాయణ, సూపర్ వైజర్ వరలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.