ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని ఆశా వర్కర్లకు పెండింగ్ వేతనాలు, ఇన్సెంటివ్లు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్యకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంలో సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ ప్రతిదీ మొబైల్ నుండి అప్డేట్ చేయాలని పైఅధికారులు చెబుతున్నారని, కాని ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు సరిగా పని చేయడం లేదని తెలిపారు. సెల్ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని డిలీట్ అవడం వలన బాగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన డిప్యూటీ డిఎంహెచ్ఒ మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి ఈ మొబైల్ యాప్స్ డిలీట్ అవకుండా సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న జీతాలు ఇన్సెంటివ్ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పొడియం లక్ష్మణ్, ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రవ్వ వీరమ్మ, మండల కార్యదర్శి వీరబోయిన దారేశ్వరి, నాయకులు పదం ముత్తమ్మ, సవలం ముత్తమ్మ, శ్యామల లక్ష్మి, నిరోషా, లక్ష్మి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.










