- మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు
ప్రజాశక్తి - పలాస, ఇచ్ఛాపురం: మున్సిపాల్టీ పరిధిలోని పలు పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని మున్సిపల్ విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ జి.నాగరాజు ఆదేశించారు. పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయాల్లో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్కు సంబంధించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 25వ తేదీలోగా కేసులు ఏవైనా ఉంటే ఫైల్ చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త ఎత్తివేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాల్టీలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇచ్ఛాపురం మున్సిపాల్టీలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆర్డి జి.నాగరాజు దృష్టికి మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తీసుకెళ్లారు. మున్సిపాల్టీలో చేపల చెరువు అంశం కోర్టులో ఉందని, దానిపై నిర్ణయం తీసుకుని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడం కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ను గానీ హెల్త్ అసిస్టెంట్ను డెప్యుటేషన్ వేయాలని కోరారు. సమావేశంలో కమిషనర్ టి.నాగేంద్రకుమార్, డిఇఇ హరి, ఎఇ అవినాష్, మేనేజర్ అప్పలస్వామి సిబ్బంది పాల్గొన్నారు.










