జ్యూట్ కార్మికులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి హామీ
ప్రజాశక్తి -భీమునిపట్నం: చిట్టివలస జ్యూట్ మిల్లు కార్మికుల పెండింగ్ బకాయి చెల్లింపునకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీనిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకార్మికశాఖ సహాయ అధికారి రామారావు, డిప్యూటీ అధికారి సునీత, ఐఎన్టియుసి, కాంగ్రెస్ కార్మిక సంఘం, చిట్టివలస లేబర్ యూనియన్, టిఎన్టియుసి ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2019లో కార్మికులతో యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని,కార్మిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గ్రాట్యూటీ, బోనస్, పిఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంట్ కోసం సుమారు 300 మంది కార్మికులు దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా నేటికీ ఎటువంటి స్పందన లేదన్నారు. సర్వీసులో ఉన్న కార్మికుడు మృతి చెందితే, రూ.ఐదు వేలు ఇస్తామన్నా హామీ అమలుకు నోచుకోలేదన్నారు.సమావేశంలోకార్మిక సంఘాల ప్రతినిధులు కె వరహాలరాజు, జీరు వెంకటరెడ్డి, చిల్ల వెంకటరమణ, దల్లి అప్పలరెడ్డి, మునకాల ఆదినారాయణ, అల్లు బాబూరావు, కొండపు ఈశ్వరరావు, ఎంవి గురుమూర్తి, నరవ రామారావు పాల్గొన్నారు.










