ప్రజాశక్తి-ఆదోనిరూరల్
పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న, కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి.తిక్కప్ప డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కుప్పగల్లు, సంతేకుడ్లూరు గ్రామాల్లో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఇప్పటికే ఐదు వారాలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. బిల్లుల చెల్లింపులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న ఉపాధి బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్స్, గడ్డపార సాన పెట్టుకోవడానికి వేతనం కొనసాగించాలని, ఉపాధి కూలీలకు తాగునీరు, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉపాధి కూలీలను సమీకరించి ఈ నెల 22న కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వ్యకాస, కెవిపిఎస్ నాయకులు










