ప్రజాశక్తి- సీతమ్మధార : పేదోడి సొంతింటి కల సాకారం చేయటమే లక్ష్యంగా సిఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, నెడ్క్యాప్ రాష్ట్ర చైర్మన్ కెకె.రాజు అన్నారు. బుధవారం 26వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.బుధవారం వార్డు వైసిపి ఇన్ఛార్జి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం షాదీఖానాలో నిర్వహించిన కార్యక్రమంలో రాజు మాట్లాడుతూ, పేదలకు ఇళ్లు, ఇళ్లపట్టాలు పంపిణీలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్లపట్టాలను వైసిపి ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో 1203 మందికి జగనన్న ఇళ్ల పట్టాలు, 202 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జివిఎంసి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పోతు సత్యనారాయణ, జెడ్సి శివప్రసాద్, ఎపిడి దుర్గాప్రసాద్, వార్డు వైసిపి నేతలు బొడ్డేటి కిరణ్, శేషు, అమ్మాజీ, పాండవ శ్రీను, శ్యామల, పాండవ ఈశ్వరరావు, రాము, రవి, అప్పారావు భాయి జాన్, దేవి, సునీల్ యువసేన పాల్గొన్నారు.










