ప్రజాశక్తి- తుని (కోటనందూరు) తమది పేద బలహీనవర్గాల సంక్షేమ ప్రభుత్వం అని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తుని పట్టణంలో రాష్ట్రానికి జగనే ఎందుకు అవసరమనే కార్యక్రమంలో మంత్రి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనంతగా సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేనన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభత్వానేదన్నారు. గతంలో జన్మభూమి జన్మభూమి కమిటీలతో సామాన్య ప్రజలను దోచుకున్న టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలను నిలువు దోపిడీ చేస్తుందని, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. అనంతరం కోటనందూరుకు చెందిన పేదలకు వైయస్సార్ గృహ నిర్మాణ పట్టాలను పంపిణీ చేశారు. వైసిపి మండల కన్వీనర్ చింతకాయల చినబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపిపి లగుడు శ్రీనివాస్, లాలం బాబ్జి, సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు, నల్లమిల్లి గోవిందు,కో ఆప్షన్ సభ్యులు జగడాల కోట సత్తిబాబు, సొసైటీ చైర్మన్ గొర్ల అచ్చి నాయుడు, బంటుపల్లి గంగాధర్, బంటుపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










