Jul 31,2023 21:12

ప్రభుత్వ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-పాచిపెంట : అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పాచిపెంట మండల కేంద్రంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామంలో ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేస్తామన్నారు. ఎవరూ అధైర్య పడవద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలని కోరారు. పింఛన్లు, పక్కా గృహాలు, అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా కానుక, రైతు భరోసా వంటి పథకాలు గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు డోల బాబ్జి, టి.గౌరీశ్వరరావు, రంగునాయుడు, గొర్లె జగన్మోహనరావు, దండి శ్రీనివాసరావు, మీసాల చంటి, మజ్జి వెంకట్రావు, ఎంపిడిఒ జి.పార్వతి, తహశీల్దార్‌ ఆర్‌.రాజశేఖర్‌ పాల్గొన్నారు.