ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆసుపత్రి, ఇతర అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే పేదలు ఆకలితో తిరిగి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే నగరంలో ఆరు ఫుడ్ బ్యాంకుల ద్వారా ఉచితంగా భోజనం పెడుతున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శ్రీగౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న నగరంలోని ఎన్సిఎస్ రోడ్డులో ఉన్న ఫుడ్ బ్యాంకు వద్ద రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం చేపట్టిన భోజన వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలకు స్వయంగా వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ఆరు ఫుడ్ బ్యాంకుల ద్వారా నిత్యం వందలాది మందికి ఉచితంగా భోజనం పెడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం ప్రతినిధులు కనిశెట్టి సుధాకర్, అడారి నగేష్, ఓం శంకర్, కాండ్రేగుల శేఖర్, మొల్లేటి నాయుడు, అడారి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.