ప్రజాశక్తి-నిజాంపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడు తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. నిజాంపట్నం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మోపిదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళాభివృద్ధే ధ్యేయంగా మహిళలకు తోడబుట్టిన సోదరుడిగా, వృద్ధులకు కన్న కొడుకు లాగా ఆదరిస్తున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. వైఎస్సార్ ఆసరాలో భాగంగా నిజాంపట్నం మండలానికి మూడో విడత 1,416 గ్రూపులకు 14,160 మంది సభ్యులకు గాను 13,66,22,524 రూపాయలను నేరుగా వారు ఎకౌంట్లోకి వేసి మహిళల అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మన మండలానికి 300 కోట్ల 21 లక్షల రూపాయలను కేటాయించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీకి రుణపడి ఉండాలని ఆ రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ బొంత అర్జునరావు, ఎంపీపీ మోపిదేవి విజయనిర్మల హరినాథ్ బాబు, జడ్పిటిసి నర్రా సుబ్బయ్య, వైస్ ఎంపీపీలు ఉన్నవ వెంకటేశ్వర్లు, తోటకూర సుబ్బారావు, ఎంపీటీసీ నాజర్ఖాన్, తహశీల్దారు శిరీష, ఎంపీడీవో నర్రా నాగలక్ష్మి, ఏపీఎం కృపాసాగర్, ఏరియా కోఆర్డినేటర్ ఉమాదేవి, ఎంపీటీసీలు, మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు మహిళా సమాఖ్య సంఘం సీసీలు, యానిమేటర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










