
ప్రజాశక్తి ములగాడ : పౌరులు చైతన్యవంతులైనప్పుడే ప్రజాస్వామ్యానికి రక్ష ఉంటుందని సెయింట్ ఆన్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇపిఎస్.భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యాన ''భారత రాజకీయాలు- పౌర చైతన్యం'' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో ప్రజలు, విద్యావంతులు, చైతన్యవంతులయ్యారని తెలిపారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా, సమాచార హక్కు చట్టం ద్వారా, న్యాయ సమీక్ష ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అదుపులో పెడుతున్నారని, ఇది శుభ సూచకమని పేర్కొన్నారు. రాజనీతి శాస్త్ర విభాగం సీనియర్ అధ్యాపకులు వై.అనసూయాదేవి మాట్లాడుతూ, పౌరులు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ద్వారా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలపాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సరైన నాయకులను ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. అనంతరం భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, పార్లమెంటు అధికారాలు, విధులు, రాష్ట్రపతి అత్యవసర అధికారాలు, క్యాబినెట్ నిర్మాణం, ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్ర గవర్నర్ విచక్షణ అధికారాలు, పంచాయతీ రాజ్లో వస్తున్న మార్పులు, భారత ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థ, ఎన్నికల సంస్కరణల గురించి విద్యార్థినులు తమ అభిప్రాయాలను అధ్యయన పత్రాల రూపంలో సమర్పించారు. అధ్యయన పత్రాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. విద్యార్థినులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు అధ్యాపకురాలు అనసూయదేవి సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజనీతి శాస్త్ర విభాగాన్ని, విద్యార్థినులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ప్రేమ కుమారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ జానీస్ అభినందించారు. ఇటువంటి సదస్సులు విద్యార్థినుల్లో ఆసక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుతాయని కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ గెసిల్లా అన్నారు. సదస్సును విద్యార్థి నాయకులు అవంతి, ధనుషా, ధనలక్ష్మి, సాక్షి, శ్రేయ సమన్వయం చేశారు.