Aug 19,2023 22:13

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌

* జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
పాఠశాలల్లో వియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ క్లబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వినియోగదారుల క్లబ్‌ల ఏర్పాటుపై ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై విజయవాడలో శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. చట్టం విశిష్టత, అవసరాన్ని విద్యార్థులు, ప్రజలకు తెలియజేయాలని వివరించారు. హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందనే విషయాలపై తెలపాలన్నారు. వినియోగదారుల సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు బి.రామ్మోహనరావు మాట్లాడుతూ వినియోగదారుల చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. జిల్లాలో 106 క్లబ్‌లు ఏర్పాటు చేయగా, పాఠశాలల్లో 100 క్లబ్‌లు, డిగ్రీ కళాశాలల్లో ఆరు క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్‌ ట్రైనర్‌ ఎల్‌.వెంకటాచలం వినియోగదారుల హక్కులు, చట్టాలు తదితర వాటిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డిఎస్‌ఒ వెంకటరమణ, తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి విశ్వేశ్వరరావు, ఎఎస్‌ఒ జె.రవి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిటి గోపాల్‌, ఈశ్వర సాయికుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.